తల్లి, కుమారుడు.. క్లాస్మేట్స్!
ఓకే తరగతి గదిలో రోషన్,తల్లి స్వర్ణలత…
కబురు న్యూస్,పెద్దపల్లి,డిసెంబర్ 01 :
పైన చిత్రంలో కనిపిస్తున్న తల్లి,కుమారుడు రోషన్ ఇద్దరు క్లాస్మేట్స్.ఉజ్వల భవిష్యత్తు కోసం కుమారుడిని డిప్లొమా కోర్సులో చేర్చిన తల్లి,తాను కూడా ఎందుకు నేర్చుకోకూడదని ఆలోచించింది.ఇంకేముంది..!!ప్రవేశం తీసుకుని తనయుడితో కలిసి తరగతులకు హాజరవుతున్నారు.స్ఫూర్తిదాయకమైన ఈ ఉదంతానికి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామం వేదికైంది.38 ఏళ్ల జక్కుల స్వర్ణలతకు ఇంటర్మీడియెట్ చదివే సమయంలో పెళ్లయింది.కూలి పని చేసే భర్త లక్ష్మణ్ ప్రోత్సాహంతో ఆమె దూరవిద్యలో డిగ్రీ,పీజీ చదివారు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు రోషన్ను ఐటీఐలో ఏడాది కాలపరిమితి కలిగిన కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేర్చాలని నిర్ణయించారు.ఈ కోర్సు అభ్యసించేందుకు వయోపరిమితి 45 సంవత్సరాల వరకు ఉండటంతో సెప్టెంబరులో నిర్వహించిన స్పాట్ అడ్మిషన్లో కుమారుడితో కలిసి ఆమె సైతం ఐటీఐలో చేరారు.ఇద్దరూ కలిసి రోజూ 15 కి.మీ.దూరంలోని పెద్దపల్లి ఐటీఐలో తరగతులకు హాజరవుతున్నారు.తాను నేర్చుకోవడంతో పాటు కుమారుడిని ప్రోత్సహించేందుకు ఈ కోర్సులో చేరినట్లు స్వర్ణలత తెలిపారు.
