శివుని అనుగ్రహం పొందాలా!!ఐతే చేపలకు ఈ ఆహారం వేయాల్సిందే మరి..
శ్రావణ సోమవారం,మాసం ప్రత్యేక కబురు ఆధ్యాత్మిక కథనం….
కబురు న్యూస్,ఆధ్యాత్మికం, ఆగస్టు 05 :
శ్రావణ సోమవారం ఎందుకు అంత ప్రత్యేకమైనదో మనం తెలుసుకుందాం!!
మన సంస్కృతీ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.అందుకే ఈ మాసాన్ని శుభాల మాసం,పండుగల మాసం అంటారు.శ్రావణం ఆధ్మాత్మిక మాసం.ఈ నెలలో అన్ని రోజులు శుభకరమే.సౌరమానం ప్రకారం హిందూ కేలండర్ను అనుసరించి శ్రావణమాసం ఐదో నెల.ఈ మాసం ఏంతో పవిత్రమైనది.ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన శ్రావణం శివారాధనకు ఎంతో శ్రేష్ఠమైంది.ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైనది.ఈ మాసమంతా ప్రతి ఇంట్లో నిత్య పూజలతో అలరారుతూ ఉంటుంది.ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి.ప్రతి ఆలయం ప్రత్యేక పూజలతో,అభిషేకాలతో సందడిగా మారతుంది.శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం.ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావణం.అలాగే శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడ శ్రావణమే.శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే,బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం కూడా ఇదే.భక్తి మార్గాల్లో శ్రవణభక్తి మొదటిది.శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడని ప్రతీతి.
అందుకే శ్రావణ మాసానికి అంత ప్రత్యేకత సంతరించుకుంది..
శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు విశిష్టతే.ఈ మాసమంతా శ్రవణ నక్షత్రం ఉండటమే కారణమని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ముక్తి ప్రధాత ముక్కంటికి సోమవారం ప్రీతికరమైనది.ఈ రోజున స్వామిని పూజించినంతనే స్వామి కటాక్షం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.లింగస్వరూపుడైన ఆ దేవదేవుడిని అభిషేకాలు,అర్చనలతో 👏నమస్కరిస్తే శుభాలు కలిగి సకల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం.హిందువులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు,నోములు,పూజలు నిర్వహిస్తారు.శ్రావణ సోమవార వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడతారు.మంగళవారం మంగళ గౌరీ వ్రతానికి కూడా విశిష్టత ఉంది. శ్రావణం శివుని ఆరాధనకు అనుకూలమైంది.శివుని పూజించడం వల్ల వివాహంలో ఏర్పడిన ఆటంకాలు తొలగి,చేపట్టిన పనిలో విజయం లభిస్తుందని వేదాలు, పురాణాలు పేర్కొన్నాయి.
శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు లభిస్తుంది. భక్తులు తమ తప్పులను మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు.ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది.అదృష్టం కలిసి వస్తుంది.సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానానంతరం శివాలయాలను దర్శించాలి.పాలు,జలంతో శివుడికి అభిషేకం చేసి *ఓ నమఃశివాయ* పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
శ్రావణ మాసంలో సిద్ధ ప్రద శివలింగాన్ని ఇంట్లో ఉంచి అభిషేకం చేయాలి.చన్నీటితో శుద్ధిచేసి,పాలతో అభిషేకించాలి.బిల్వ పత్రాలు,విభూది సమర్పించాలి.దగ్గర్లోని చెరువులు, నదులకు వెళ్లి చేపలకు ఆహారం వేయాలి.గోధుమ పిండితో తయారుచేసిన ఆహారం వాటికి తినిపిస్తే,ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.చేపలకు ఆహారం ఇవ్వడమంటే అంటే శివుడికి అందించినట్టేనని పురాణాలు చెబుతున్నాయి.మహామృత్యుంజయ జపం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.రోజూ 108 సార్లు జపించాలి.మహామృత్యుంజయ హోమం కూడా శ్రావణ సోమవారం నాడు నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుంది.వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొంటే కుంకుమపువ్వు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేయాలి.శివపార్వతుల అనుగ్రహం పొంది వ్యక్తిగత బంధాల్లో ఏర్పడిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి.ఆవులు,గేదెలకు పచ్చగడ్డి తినిపిస్తే శ్రేయస్సు కలుగుతుంది.విజయాలు వెదుక్కుంటూ వస్తాయి.
